https://prajasakti.com/features/conquer
ఒత్తిడి వద్దే వద్దు…’పది’ని జయించు
నూతన సిబిఎస్సి సిలబస్తో పదో తరగతి పరీక్షలు మొదటి సారిగా మన రాష్ట్రంలో ఈనెల 17 నుంచి ప్రారంభంకానున్నాయి. పరీక్షల సమయంలో సాధారణంగా విద్యార్థులు ఒత్తిడికి గురౌతుంటారు. ఇది ఏమాత్రం సరికాదు. ప్రశాంతంగా ఉండాలి. ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా ఉండాలి. తద్వారానే పరీక్షల్లో మంచిగా పరీక్షలు రాసి తద్వారా మంచి మార్కులు సాధించే అవకాశం ఉంటుంది. ఏడాదిపాటు చదివిన అంశాలే కాబట్ట్టి అన్ని ప్రతిరోజూ అన్ని సబ్జెక్టులకు సంబంధించిన పాఠాలను చదువుకుంటూ వెళ్లటం ఉత్తమం. తద్వారా గతంలో చదివిన విషయాలను మళ్లీ ఒకసారి గమనంలోకి తెచుకోవటానికి అవకాశం ఉంటుంది. అందువల్ల పిల్లలూ ఎవ్వరూ ఒత్తిడికి గురికావద్దు. ప్రణాళికాబద్ధంగా కషిచేస్తే మంచి మార్కులతో విజయం సాధించటం సులభమే అవుతుంది. ఏడాదిలో కష్టపడి చదివింది ఎలాంటి తప్పిదాలకు తావీయకుండా 3.15 గంటల సమయంలో (పిఎస్, ఎన్ఎస్ పరీక్షలు 2 గంటలు మాత్రమే) పరీక్షల్లో సమర్థవంతంగా రాయగలిగినప్పుడే చక్కని ఫలితం చేజిక్కుతుంది. చిన్న తప్పిదాల కారణంగా ప్రతిభావంతులు సైతం ట్రిపుల్ఐటీల్లో ప్రవేశం కోల్పోతుంటారు.
జవాబులు ఇలా రాయాలి
ప్రశ్నాపత్రంలోని ప్రశ్నలు విద్యార్థుల పరిశీలన, విశ్లేషణ, అవగాహన శక్తిని వెలికితీసేలా ఉంటాయి. అందుకే ప్రశ్నాపత్రాన్ని చదవడానికే పావుగంట సమయం ఇచ్చారు. సుమారు 75శాతం మంది ప్రశ్నాపత్రాన్ని తీసుకున్న 5 నిమిషాల్లోనే జవాబులు రాయటం మొదలెడుతున్నారు. ఇది సరికాదు. ముందుగా ప్రశ్నలను బాగా చదవాకే సమాధానాలు రాయటం ప్రారంభించాలి. సమాధాన పత్రాలతో కూడిన బుక్లెట్ ఇవ్వగానే ముందుగా ప్రతి పేజీకి ఎడమవైపు 2-2.5సెంటీమీటర్లు ఉండేలా మార్జిన్ వదలాలి.
తెలుగులో మూడు భాగాలుంటాయి. మొదటి భాగంలో 32 మార్కులు సులభంగా సాధించొచ్చు. వీటిలో పరిచిత పద్యాలు 21 ఉన్నాయి. వీటిలో 8 సాధన చేస్తే మంచి మార్కులు సాధించొచ్చు. పద్య భాగంలో కవి పరిచయం, గద్యంలో ప్రక్రియలు, లేఖ, కరపత్రం అంశాలు, ఛందస్సులో వృత్తపద్యాలపై ప్రశ్నలొస్తాయి. మారీచుడు, కైక, విశ్వామిత్రుడు, సుగ్రీవుడు, దశరధుడు వంటి అంశాలతోపాటు రామాయణం ప్రాశస్త్యం, తదితర అంశాలపై పట్టుసాధిస్తే మంచి మార్కులు సాధించొచ్చు.
హిందీ సబ్జెక్ట్లో తొలుత ప్రశ్నావళిని అవగాహన చేసుకొని ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. సెక్షన్-1లో 12 ప్రశ్నలు వ్యాకరణానికి సంబంధించినవి ఉంటాయి. పేరాగ్రాఫ్ పాసేజ్ చక్కగా చదివి జవాబులు రాయాలి. 13,14,15,16 ప్రశ్నల్లో కీలక పదాన్ని గుర్తించి సమాధానాన్ని తేలికగా వెదికి జవాబు రాయాలి. 17 ప్రశ్న కబీర్, మైథిలి, శరణగుప్తలో కవి పరిచయం వస్తుంది. 19వ ప్రశ్న సాఖీ పాఠంలోని 4 దోహాలలో ఒకటి తప్పనిసరిగా వస్తుంది. వీటిని జాగ్రత్త చదవడం ద్వారా మంచి మార్కులు పొందొచ్చు.
ఇంగ్లీషు ప్రశ్నాపత్రంలో మొత్తం మూడుసెక్షన్లు ఉంటాయి. ప్రశ్నా పత్రంలోని ప్రశ్నలు క్షుణ్నంగా చదివి జవాబులు రాయాలి. కాంప్రహెన్షన్ ప్యాసేజ్లో ప్రశ్నలకు ఇచ్చిన టెక్ట్స్లోనే సమాధానాలు ఉంటాయి. దీంతో సులభంగానే 30 మార్కులు సాధించొచ్చు. సెక్షన్ బిలో గ్రామర్ అండ్ ఒకాబులరీలో యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, ప్రిపోజిషన్స్, డిక్షనరీ ఎంట్రీ, స్పెల్లింగ్ టెస్ట్, సిఫిక్స్-ప్రిఫిక్స్ వంటివి తేలికగా జవాబులు రాయొచ్చు. సెక్షన్ సిలో క్రియేటివ్ ఎక్స్ప్రెషన్ సొంతంగా రాయడం ద్వారా మంచి మార్కులు సాధించొచ్చు. సమాధానాలన్నీ ఒకేచోట క్రోనాజికల్ ఆర్డర్లో రాయాలి.
గణితశాస్త్రంలో మార్కుల సాధన సులభం. సంభావ్యత బహుపదులు, వాస్తవ సంఖ్యలు, నిరూపక రేఖాగణితం అధ్యాయాలపై ప్రత్యేక ప్రాక్టీసు చేయాలి. నిరూపక జామితి పాఠ్యాంశం నుంచి సెక్షన్ నాలుగు లేదా ఎనిమిది మార్కులకు, సాంఖ్యకశాస్త్రంలోని మీన్, మోడ్, మీడియన్లపై తప్పనిసరిగా ప్రశ్న ఉంటుంది. గ్రాఫ్పై సాధన చేస్తే మంచి మార్కులు సాధించొచ్చు.
భౌతిక రసాయన శాస్త్రంలో 50/50 మార్కులు సాధించొచ్చు. ఎన్సీఆర్టీ వారు అందించిన స్టడీమెటీరియల్ను సాధన చేయడం ద్వారా మంచి మార్కులు పొందొచ్చు. లోహాలు, అలోహాలు పాఠం నుంచి ప్రయోగం నేర్చుకుంటే సులభంగా ఎనిమిది మార్కులు పొందొచ్చు. మయోపియా, హైపర్ మెట్రోపియా దృష్టి లోపాలు, వాటిని సవరించే విధానం నేర్చుకోవాలి. ఇంద్రథనుస్సు ఏర్పడే విధానం కాంతి పరిక్షేపణ వంటి ప్రశ్నలు ప్రశ్నలు బాగా సాధన చేస్తే మంచి మార్కులు వస్తాయి. బొమ్మలు గీసేటపుడు స్పష్టతతో ఉంటే మంచి ఫలితాలు సొంతం చేసుకోవచ్చు. భౌతికశాస్త్రంలోని సమస్యల (ప్రాబ్లెమ్స్)లో ప్రమాణాలను రాయడం మరిచిపోరాదు. ఉధాహరణకు సెంటీ మీటరు, గ్రాము, జౌలు, వాట్స్ తదితరాలు. జీవశాస్త్రంలో ప్రయోగాలకు చెందిన జవాబులను రాసేటప్పుడు సంబంధిత బమ్మలను కూడా తప్పక వేయాలి. గణితంలో ముఖ్యమైన నిర్వచనాలు, సూత్రాలు రివిజన్ చేయాలి. టెక్ట్స్బుక్ చాప్టర్ చివరలో ఉండే సమస్యలను మరొక్కసారి రివిజన్ చేసుకోవాలి.
సాంఘిక శాస్త్రంలోని మ్యాప్ పాయింట్కు మంచి ప్రాధాన్యత ఇవ్వాలి. పైచార్టు, మ్యాప్ రీడింగ్ ప్రశ్నలను తప్పనినరిగా రాయాలి. సమకాలీన అంశాల్లో మూస ధోరణులకు ప్రాధాన్యం తగ్గించి, సొంత అవగాహనతో నిత్య జీవిత ఉదాహరణలు అన్వయిస్తూ రాయాలి. ఎన్సీయారిటీ వారు ఇచ్చిన ప్రశ్నాపత్రాలు ప్రాక్టీస్ చేయాలి.సమాచార నైపుణ్యాలపై ఆర్ధశాస్త్రంలోని మొదటి మూడు పాఠాలలోని సమాచార పట్టికలు, బార్గ్రాఫ్ను అధ్యయనం చేస్తే మంచి మార్కులు సాధించొచ్చు.
ప్రశ్నాపత్రంలో బాగా వచ్చిన ఏ ప్రశ్నకైనా ముందుగా జవాబు రాయొచ్చు. ఆ ప్రశ్న నంబరును ఎడమవైపు మార్జిన్లో తప్పక వేయాలి. ప్రశ్నల నంబర్లు తప్పుగా వేయడం, మరిచిపోవడం చేసేవారు 1శాతం వరకూ ఉంటారు.
ఈ జాగ్రత్తలు పాటించండి
- ఒత్తిడికి గురికాకూడదు.
- తక్కువ సమయంలో రివిజన్ చేసుకోవాలి
- కొత్త అంశాలు నేర్చుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వాలి
- ఆహారం, నిద్ర, వ్యాయామానికి తగినంత సమయాన్ని కేటాయించాలి
- ఎన్టీఆర్టీ ప్రశ్నలనిధి. మాదిరి పశ్న్రా పత్రాలు ప్రాక్టీస్ చేయాలి
- ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి
- సెల్ఫోన్, టివి, కంప్యూటర్లకు దూరంగా ఉండాలి
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
- ఎర్ర సిరా ఉండే (బాల్)పెన్ను వాడకూడదు.
- నీలం బ్లూ, నలుపు సిరా ఉండే వాటినే ఉపయోగించాలి.
- పెద్ద అక్షరాలతో, మరీ ఎక్కువ మార్జిన్ వదిలి భారీగా పేజీలు నింపడం వల్ల ప్రయోజనం శూన్యం.
- ప్రతి పుటకు 20-25 వాక్యాలు రాస్తే మేలు.
- జవాబులను వ్యాసంలా కాక బుల్లెట్ పాయింట్ల రూపంలో రాయాలి.
- రాయాల్సినవన్నీ పూర్తయ్యాకే ఐచ్ఛిక (ఛాయిస్) ప్రశ్నలు రాయడానికి ప్రయత్నించాలి.
- కొట్టివేతలు, దిద్దివేతలు ఉండరాదు. బ్రాకెట్లో ఒకటి రాసి, మళ్లీ కొట్టివేసి బయట రాయటం మంచిది కాదు.
- సాధ్యమైనంత వరకు 10-15 నిమిషాలు ముందే పరీక్ష రాయటం పూర్తిచేయాలి.
- రాసిన జవాబులు, ప్రశ్నల నంబర్లను మరోసారి పరిశీలించుకోవాలి.
ఆత్మ విశ్వాసంతో పరీక్షలు రాయండి… విజయాన్ని సాధించండి. అభినందనలతో
– ఎస్.పి.మనోహర్ కుమార్,
యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి, సెల్ : 9490762412